కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం యూపీలోని తన సొంత నియోజకవర్గం రాయ్ బరేలీలో పర్యటించినప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. “ప్రధాని మోడీ అనాలోచిత నిర్ణయాలు, లోపభూయిష్టమైన విధానాల వలన దేశంలో పెను ఆర్ధిక సంక్షోభం రాబోతోంది. ముఖ్యంగా యువత, రైతులు, చిరు వ్యాపారులపై ఇది తీవ్ర ప్రభావం చూపబోతోంది. కనుక దేశ ప్రజలు అందరూ దీనిని ఎదుర్కొని తట్టుకొని నిలబడేందుకు అందుకు సిద్ధంగా ఉండాలి.
కానీ ఎంత పెద్ద ఆర్ధిక సంక్షోభం వచ్చినా మోడీ ఆప్తమిత్రులు అంబానీ, ఆదానీలకు మాత్రం ఏమీ కాదు. అంబానీ, అదానీల పట్ల చాలా ఉదారంగా వ్యవహరిస్తూ వారిని వెనకేసుకు వచ్చే ప్రధాని మోడీ, దేశ ప్రజలను పొదుపుగా జీవించమని చెపుతున్నారు.
పశ్చిమాసియా యుద్ధం వలన దేశంలో చమురు సంక్షోభం ఏర్పడబోతోందన్న ప్రధాని మోడీ, దేశ ప్రజలు బంగారం, పెట్రోల్, డీజిల్ కొనుగోలు తగ్గించాలని, విదేశీ పర్యటనలు మానుకోవాలని పిలుపునిచ్చారు. కానీ మర్నాడే అయన ప్రత్యేక విమానం వేసుకొని విదేశీ పర్యటనలకు బయలుదేరి వెళ్ళారు. అంటే ఆయన దేశ ప్రజలకు చెప్పింది స్వయంగా ఆచరించరన్న మాట!” అని రాహుల్ గాంధీ అన్నారు.