వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలు అత్యధిక ఉష్నోగ్రతలతో అగ్నిగుండంలాగే మారాయి. అత్యధికంగా నేడు జగిత్యాల జిల్లా కోరుట్లలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, నల్గొండ జిల్లాలోని కట్టంగూర్. నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్, సిద్ధిపేట జిల్లాలోని కొహెడలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి, పెద్దపల్లి జిల్లాలోని ఎలిగేడులలో 45.7 డిగ్రీలు నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లాలోని మావల, కరీంనగర్ జిల్లాలొనిఒ గంగాధర, నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్, రాజన్న సిరిసిల్లా, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
హనుమకొండ జిల్లాలోని ధర్మాసాగర్, ఖమ్మం జిల్లాలోని ఏనాకూరు, సూర్యాపేట జిల్లాలోని మట్టంపల్లిలో గరిష్టంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. మిగిలిన జిల్లాలలో 43-44 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే మూడు రోజులు కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ తెలియజేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా వడగాడ్పులు కూడా వీస్తాయని తెలిపింది. ఈ నెల 26 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయని తెలిపింది. కనుక అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ళలో నుంచి బయటకు రావద్దని ఆయా జిల్లాల అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.