సోమవారం సాయంత్రం జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. దాదాపు ఏడాది తర్వాత మళ్ళీ ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఈ సభ ద్వారా ప్రజల ముందుకు వస్తున్నారు. కనుక సభకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సభని విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలు గట్టిగా కృషి చేస్తున్నారు. నేటి సభలోనే జీవన్ రెడ్డి, అయన అనుచరులు కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు.
ఇవ్వాళ్ళే సిఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి కాళేశ్వరం వద్ద గల ప్రసిద్ద ముక్తేశ్వరం ఆలయంలో పూజలు చేసి, ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారు. తర్వాత అక్కడి నుంచి మేడిగడ్డ బ్యారేజ్కు చేరుకొని 7వ బ్లాకులో కృంగిన మూడు పియర్స్ పునరుద్దరణకు జరుగుతున్న పనులను పరిశీలిస్తారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి అక్కడే అధికారులతో మరమత్తు పనులని సమీక్షిస్తారు.
తర్వాత కాటారం మండలంలోని నస్తూర్ పల్లిలో జరిగే బహిరంగ సభకు హాజరై రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు.
నేడు ఒకేరోజు సిఎం రేవంత్ రెడ్డి-మాజీ కేసీఆర్ పోటాపోటీగా సభలు నిర్వహించ బోతున్నారు కనుక రాష్ట్ర రాజకీయాలలో ఒక్కసారిగా వేడి పెరుగబోతోంది.