ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (ట్రిబ్యునల్)కి హైకోర్టు నోటీస్ జారీ చేసింది. పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో స్పీకర్ విచారణ, తీర్పు చాలా లోపభూయిష్టంగా ఉందంటూ బిజేపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు.
దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి మారిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్ధిగా లోక్సభ ఎన్నికలలో పోటీ చేశారని, ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారని పిటిషన్లో పేర్కొన్నారు.
కానీ స్పీకర్ విచారణ జరిపినప్పుడు తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని పార్టీ మారలేదని చెప్తే, స్పీకర్ ఆయన మాటనే పరిగణనలోకి తీసుకొని ఫిరాయించలేదని తీర్పు చెప్పారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. కనుక దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాల్సిన స్పీకర్, అనుకూలంగా తీర్పు చెప్పడాన్ని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తప్పు పట్టారు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా దానం నాగేందర్కు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (ట్రిబ్యునల్)కి నోటీస్ జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేసింది.