తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ నవీన్ రావు నేడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. మాజీ సిఎం కేసీఆర్ ఆదేశం మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సిట్ భావిస్తోంది.
కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత సైతం తన తండ్రి హయంలో తమ ఇంట్లో అందరి ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని చెప్పారు కూడా.
ఇంతవరకు ఈ కేసులో అధికారులను విచారించిన సిట్ బృందం నేడు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్కి ముఖ్య అనుచరుడుగా భావిస్తున్న నవీన్ రావుకి నోటీసులు ఇచ్చి విచారణకు రప్పించడంతో ఆ పార్టీ నేతలు ఆందోళన చెందడం సహజం.
ఈ కేసులో ముందుగా తనకు నోటీస్ రాబోతోందని మాజీ మంత్రి హరీష్ రావు మొన్ననే చెప్పారు. కానీ నవీన్ రావుని పిలిపించి ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలను ప్రశ్నించడం మొదలైంది కనుక తర్వాత ముఖ్య నేతలకు నోటీసులు పంపించవచ్చు.