కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ పీసీ ఘోష్ కమీషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం తమపై ఎటువంటి చర్య తీసుకోరాదని, కమీషన్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ జరుపరాదని కోరుతూ మాజీ సిఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుళ పిటిషన్లపై హైకోర్టు అప్పుడే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి వారికి ఉపశమనం కల్పించింది.
ఆ తర్వాత ఇదే కేసులో ఐఏఎస్ అధికారులు ఎస్.కె. జోషీ, స్మితా సభర్వాల్ కూడా వేర్వేరుగా పిటిషన్స్ వేశారు. వీటన్నిటిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని అభ్యర్ధించడంతో ఈ కేసులన్నీ నవంబర్ 12కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. కనుక ఈ కేసులో అందరికీ ఉపశమనం కలిగిస్తూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను కూడా అంత వరకు హైకోర్టు పొడిగించింది.
ఈ కేసుపై సీబీఐ చేత విచారణ జరిపించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ వ్రాసి నెల రోజులు పైనే అవుతున్నా ఇంతవరకు స్పందించలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.