అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వంద శాతం సుంకాలు విదించి భారత్ ఫార్మా రంగాన్ని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూనే, ఇకపై అమెరికాలోనే ఫార్మా కంపెనీలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. కానీ అమెరికాకు చెందిన సుప్రసిద్ధ ఫార్మా కంపెనీ ‘ఎలీ లిల్లీ’ తెలంగాణ రాష్ట్రంలో రూ. 9,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది!
ఈ మేరకు సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సోమవారం ఇంటిగ్రేటడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన సమావేశంలో ఎలీ లిల్లీ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, ఇండియా ప్రెసిడెంట్ విన్సల్ టక్కర్, మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి పాల్గొన్నారు. సుదీర్గ చర్చల తర్వాత హైదరాబాద్లో రూ. 9,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎలీ లిల్లీ ప్రెసిడెంట్ అంగీకరించారు.
దాదాపు 150 సంవత్సరాలుగా ఎలీ లిల్లీ కంపెనీ ఫార్మా రంగంలో ఉంది. ఇది ప్రధానంగా డయాబెటీస్, అల్జీమర్స్, ఒబెసిటీ తదితర వ్యాధులకు సంబంధించి మందులు తయారు చేస్తుంటుంది. బయో టెక్నాలజీ, జెనెటిక్ మెడిసన్ తదితర రంగాలలో ప్రయోగాలు చేస్తూ అనేక ఆవిష్కరణలు చేసింది.
భారత్లో ఇప్పటికే బెంగళూరు, గురుగ్రామ్, హైదరాబాద్లో ఎలీ లిల్లీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తొలిసారిగా రూ. రూ. 9,000 కోట్లు పెట్టుబడితో తెలంగాణ రాష్ట్రంలో భారీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. దీని ద్వారా ప్రత్యక్షంగా వేలమందికి ఉద్యోగాలు లభించనున్నాయి.