తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీరుని తప్పు పడుతున్నారు.
ఇటీవల సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “కాళేశ్వరం కేసుపై విచారణ జరిపించి కేసీఆర్ని అరెస్ట్ చేయడం మీ వల్లకాకపోతే సీబీఐకి అప్పగించమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పదేపదే అనేవారు. కానీ సీబీఐ చేత విచారణ జరిపించాలంటూ మేము కేంద్రానికి లేఖ వ్రాసి రెండు వారాలవుతున్నా స్పందన లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేటీఆర్ చెపుతున్నట్లు నడుచుకుంటూ ఈ కేసుపై సీబీఐ విచారణ మొదలవకుండా అడ్డుపడుతున్నారు,” అని ఆరోపించారు.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేడు మీడియాతో మాట్లాడుతూ, ‘బీసీ రిజర్వేషన్స్ కోసం మా ప్రభుత్వం శాసనసభలో మూడు సార్లు చట్టాలు చేసి గవర్నర్ ఆమోదానికి పంపిస్తే ఆయన వాటిని రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో దానిని అడ్డుకుంటున్నారు,” అని ఆరోపించారు.
కానీ బీసీ రిజర్వేషన్స్కు తమ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, దాని కోసం ఎంత దూరమైనా వెళ్ళి పోరాడి సాధించి రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కిషన్ రెడ్డి ఈవిదంగా ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు.