ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు నేడు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆయన బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరిపి ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత జూన్1వరకు మద్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తీర్పు చెప్పింది.
జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి కనుక జూన్ 5 వరకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది అభ్యర్ధనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జూన్ 2వ తేదీనా ఆయన కోర్టుకు లొంగిపోవాలని ఆదేశించింది.
అర్వింద్ కేజ్రీవాల్ తమ పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొనేందుకు, రాజకీయ సభలు సమావేశాలు నిర్వహించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.
దీనిపై అర్వింద్ కేజ్రీవాల్ అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, కీలకమైన ఎన్నికల సమయంలో బెయిల్ మంజూరు చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అనుమతించినందుకు సంతోషించారు. అర్వింద్ కేజ్రీవాల్కు బెయిల్ లభించడంతో ఢిల్లీలో ఆమాద్మీ శ్రేణులు టపాసులు పేల్చి, మిటాయిలు పంచుకొని సంబురాలు చేసుకుంటున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోనే కల్వకుంట్ల కవిత కూడా అరెస్ట్ అయ్యి దాదాపు రెండు నెలలుగా తిహార్ జైల్లో ఉంటున్నారు. రౌస్ అవెన్యూ కోర్టు ఆమె బెయిల్ పిటిషన్లను తిరస్కరించి, 20వ తేదీ వరకు జ్యూడిషియల్ రిమాండ్ని పొడిగించింది కూడా.
కనుక ఆమె ఢిల్లీ హైకోర్టులో మరో బెయిల్ పిటిషన్ వేశారు. దానిపై హైకోర్టు ఇంకా విచారణ చేపట్టాల్సి ఉంది. అప్పటి వరకు కల్వకుంట్ల కవిత బయటకు రాలేకపోవచ్చు.