బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నిన్న సాయంత్రం నిర్మల్ జిల్లా భైంసాలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన భైంసాలో రోడ్ షో నిర్వహిస్తుండగా కొందరు రామభక్తులు ఆయనపైకి టమోటోలు, ఆలుగడ్డలు విసిరారు.
దీంతో కేటీఆర్, “మీరు రామభక్తులేనా లేక బీజేపీ గూండాలా? రామభక్తులైతే ఇలా ఇతరులపై దాడులు చేస్తారా?ఇక్కడ పోలీసులు ఉన్నారా లేదా?నాపై టమోటోలు విసురుతుంటే ఏం చేస్తున్నారు?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ళు మంత్రిగా పనిచేసిన కేటీఆర్, రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఘనస్వాగతమే లభించేది. కానీ తొలిసారిగా ఈ చేదు అనుభవం ఎదురైంది.
ఆ తర్వాత కేటీఆర్ ఈ ఘటన గురించి సోషల్ మీడియా ద్వారా తన అభిమానులు, పార్టీ శ్రేణులకు తెలియజేస్తూ, “భైంసాలో కొందరు బీజేపీ గూండాలు నాపై రాళ్ళతో దాడి చేసిన్నట్లు తెలుసుకొని నాకు చాలా మంది ఫోన్లు చేసి ఆందోళన వ్యక్తం చేశారు. నాకు ఎటువంటి గాయాలు కాలేదు. మతం పేరుతో విషం చిమ్మడం, ప్రజల మద్య చిచ్చుపెడుతున్న ఈ గుండాలను ధైర్యంగా ఎదుర్కుంటాను,” అని ట్వీట్ చేశారు.