ఏపీ ఎన్నికలతో తెలంగాణ మీడియాకు ఏం సంబంధం అనుకుంటున్నారా? ఉంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ, ఆంధ్రాకు చెందిన లక్షల మంది తెలంగాణలో స్థిరపడ్డారు. వారిలో చాలా మందికి నేటికీ ఆంధ్రాలో తమ సొంత ఊర్లలోనే ఓట్లు కలిగి ఉన్నారు.
కనుక వారిని దృష్టిలో పెట్టుకొని ఏపీలోని అధికార వైసీపి, ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి రెండూ కూడా తెలంగాణ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో తమ పార్టీకి సంబందించి ప్రకటనలు ఇస్తున్నాయి.
ముఖ్యంగా అధికార వైసీపి ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా ప్రతీరోజూ రెండు తెలుగు రాష్ట్రాలలో మీడియాలో భారీగా జగనన్న నవరత్నాలు+ ప్రకటనలు ఇస్తూనే ఉంది ఈ విషయంలో టిడిపి కాస్త వెనుకబడినప్పటికీ అది కూడా బాగానే ప్రకటనలు ఇస్తోంది.
కనుక ఏపీ శాసనసభ ఎన్నికల పుణ్యమాని తెలంగాణలో మీడియాకు భారీగా ఆదాయం లభిస్తోంది. ఇదికాక తెలంగాణలోని కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ మూడు పార్టీల ప్రకటనలు ఉండనే ఉన్నాయి. ఈ ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల మీడియాకు భారీగా ఆదాయం సమకూర్చిపెడుతోంది కనుక అందరూ వెరీ హ్యాపీ!