తెలంగాణ శాసనసభ ఎన్నికల హడావుడి ముగిసి నెలరోజులు కూడా కాక ముందే మళ్ళీ లోక్సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్సభ ఎన్నికలకు ఈసీ సన్నాహాలు ప్రారంభించింది. ఎన్నికల ఏర్పాట్ల కోసం చర్చించేందుకు ఈసీ నుంచి ముగ్గురు డెప్యూటీ కమీషనర్లు ఈరోజు, రేపు ఏపీలో పర్యటించబోతున్నారు.
ఈసారి ఏపీ ఎన్నికలు 20 రోజులు ముందుగా జరుగుతాయని జగన్మోహన్ రెడ్డి ఇటీవలే చెప్పారు. ఆ మాట చెప్పిన వారంలోగానే ఈసీ బృందం ఏపీలో పర్యటించడానికి వస్తోంది. ఫిభ్రవరి 20 తేదీలోగా ఏపీ శాసనసభతో పాటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
త్వరలో జరుగబోతున్న లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీలకి కూడా చాలా కీలకమైనవే. సిఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులకు తమ సత్తాని చాటి చూపుకొనేందుకు ఇవి మరో అవకాశం కాగా, లోక్సభ ఎన్నికలు కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ నేతలకు ‘ఇజ్జత్కీ సవాల్’ వంటివి.
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో బీజేపీ 8 సీట్లు గెలుచుకొని తన బలం పెంచుకొంది. గత లోక్సభ ఎన్నికలలో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకొంది. కనుక ఈసారి కనీసం ఆ నాలుగు సీట్లు అయినా తప్పనిసరిగా గెలుచుకోకపోతే రాష్ట్రంలో బీజేపీ పరువు పోతుంది. కనుక లోక్సభ ఎన్నికలు మూడు పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకమైనవే కనుక వాటి మద్య మళ్ళీ తీవ్ర పోరాటం తప్పదు.