మాజీ సిఎం కేసీఆర్ చేతిలో ప్రస్తుత సిఎం రేవంత్ రెడ్డి ఎన్ని అవమానాలకు గురయ్యారో అందరికీ తెలుసు. ఓటుకి నోటు కేసులో రేవంత్ రెడ్డి రాజకీయ జీవితాన్ని కేసీఆర్ దారుణంగా దెబ్బ తీశారు. ఆ షాక్ నుంచి బయటపడటానికి రేవంత్ రెడ్డికి చాలా కాలం పట్టింది. నేటికీ ఆ కేసు ఆయన జీవితంలో మాయని మచ్చగా మిగిలిపోయిందంటే అందుకు కేసీఆరే కారణమని అందరికీ తెలుసు.
ఆయన తనను, తన పార్టీని, అధిష్టానాన్ని ఎంతగా అవమానించినప్పటికీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆయన గురించి ఒక్క ముక్క తప్పుగా మాట్లాడలేదు. ప్రగల్భాలు పలికి ఓడిపోయినందుకు ఆయనని పరిహసించలేదు!
ప్రస్తుతం యశోదా ఆస్పత్రిలో ఉన్న కేసీఆర్ని సిఎం రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం పరామర్శించనున్నారు. ఆయనతో పాటు మంత్రులు కూడా యశోదా ఆస్పత్రికి వెళ్ళి కేసీఆర్ని పరామర్శించనున్నారు. అధికారంలో ఉన్నవారు ఇటువంటి హుందాతనం పాటిస్తున్నప్పుడు ప్రతిపక్షాలు కూడా తప్పక పాటించవలసి ఉంటుంది. అందరూ ఇది కొనసాగించగలిగితే రాష్ట్రంలో రాజకీయాలు మళ్ళీ ఖచ్చితంగా బాగుపడతాయి.