తెలంగాణ చరిత్రలో, శాసనసభ ఎన్నికలలో చరిత్రలో ఆయన పేరు శాస్వితంగా నిలిచిపోబోతోంది. ఆయనే కామారెడ్డి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన కాటిపల్లి వెంకటరమణా రెడ్డి. ఆయన కామారెడ్డిలో సిఎం కేసీఆర్ని, కాబోయే సిఎం రేవంత్ రెడ్డి ఇద్దరినీ ఓడించారు. కనుక ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించిన ఘనత ఆయనకే దక్కుతుంది.
మాజీ జెడ్పీ ఛైర్మన్గా చేసిన వెంకటరమణా రెడ్డికి నియోజకవర్గంలో ప్రజలతో మంచి బలమైన సంబంధాలున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఆయన కామారెడ్డి ప్రజలకు అండగా నిలబడ్డారు. ఆ సమయంలో ఆయన కోట్లు రూపాయలు ఖర్చు చేశారు.
అయితే రాజకీయ ఆలోచనలతో కాక ప్రజలు పడుతున్న బాధలు చూసి చలించిపోయి, సొంత డబ్బు ఖర్చు చేస్తూ వారికి అన్నివిదాలా సహాయపడ్డారు. ఆనాడు ప్రజలకు చేసిన ఆ సేవలే నేడు ఆయనను ఎన్నికలలో గెలిపించిందని చెప్పవచ్చు.
ఒకవైపు మహాశక్తివంతుడైన కేసీఆర్, మరోవైపు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇద్దరూ కామారెడ్డి బరిలో దిగినా ప్రజలు కాటిపల్లి వెంకటరమణా రెడ్డినే గెలిపించారు. ఈ గెలుపు ఆయనకే కాక బీజేపీకి కూడా గర్వకారణమే అవుతుంది.