అజ్ఞాతవాసి సక్సెస్ అయితే పవన్ కళ్యాణ్ 26వ చిత్రం మైత్రి మూవీస్ బ్యానర్లో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రారంభం అయ్యేది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటంతో పవన్ ఇక పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దాంతో పవన్ 26వ చిత్రం ఉంటుందా ఉండదా అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తాను అంటూ మైత్రి మూవీస్ వారి వద్ద తీసుకున్న అడ్వాన్స్ను పవన్ తిరిగి ఇచ్చేసినట్లుగా కూడా తెలుస్తోంది. పవన్ వద్దనుకున్న ప్రాజెక్ట్ను రవితేజ వద్దకు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేల టికెట్ అనే చిత్రాన్ని రవితేజ చేస్తున్నాడు. ఆ చిత్రం పూర్తి కాకుండానే శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమానిచేయబోతున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చిత్రాన్ని చేయబోతున్నాడు. ఇప్పటికే మైత్రి మూవీస్ బ్యానర్ వారు రవితేజ డేట్లు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కేవలం రెండు నెలల్లోనే పవన్తో సినిమా చేయాలని భావించిన సంతోష్ శ్రీనివాస్ అదే సమయంను రవితేజతో పూర్తి చేయాలని భావిస్తున్నాడు. తక్కువ బడ్జెట్తో పూర్తి ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్గా రవితేజకు జోడీగా కేథరిన్ తెర్సాను ఎంపిక చేయడం జరిగింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన ఈ చిత్రం కోసం నటీనటుల ఎంపిక జరుగుతుంది. వేసవిలోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకు వెళ్లాలని భావిస్తున్నారు.