జాంబియా రెడ్డి, హనుమాన్ వంటి సినిమాలతో యావత్ దేశ ప్రజల దృష్టి ఆకర్షించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ తర్వాత జై హనుమాన్ తీస్తున్నట్లు చెప్పి చాలా కాలమే అయ్యింది. మద్యలో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞని పరిచయం చేయబోతున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ప్రభాస్తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. కానీ దాదాపు ఆరేడు నెలలుగా ప్రశాంత్ వర్మ సినిమాల గురించి ఎటువంటి అప్డేట్ రాలేదు. దీంతో అతను మళ్ళీ ఎప్పుడు సినిమాలు మొదలుపెడతాడు? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, “జై హనుమాన్ అనివార్య కారణాల వలన షూటింగ్ చాలా ఆలస్యమైంది. ఈ నెల 22 నుంచి హంపిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాము. ప్రభాస్తో అనుకున్న సినిమా మొదలుపెట్టడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ప్రస్తుతం ఆయన కల్కి-2, స్పిరిట్, ఫౌజీ మూడు సినిమాలు పూర్తిచేయాల్సి ఉంది. అవన్నీ పూర్తయ్యాకనే ప్రభాస్ డేట్స్ లభిస్తాయి. అంతవరకు ఆయన కోసం ఎదురుచూడక తప్పదు,” అని అన్నారు.