రాజమౌళి-మహేష్ బాబుల కాంబినేషన్లో చేస్తున్న ‘గ్లోబ్ ట్రోటర్’ ఈవెంట్ ఈ నెల 14 సాయంత్రం 6 గంటల నుంచి రామోజీ ఫిల్మ్ ఛాంబర్ సిటీలో జరుగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో పాల్గొనే అభిమానులు కూడా గాయకులతో కలిసి పాడేందుకు వీలుగా ఈ సినిమాలో ‘కాలాన్నే శాషిస్తూ... ప్రతీరోజు పరుగులే...’ అంటూ సాగే పాట లిరిక్స్ ముందుగా విడుదల చేశారు. ఇది ఎవరూ ఊహించనిదే. కనుక మహేష్ బాబు అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో మళయాళ నటుడు పృద్విరాజ్ సుకుమారన్ అత్యంత క్రూరమైన, శక్తివంతుడైన విలన్ ‘కుంభ’గా నటిస్తున్నారు. ఇటీవలే పృద్విరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
దాని ప్రకారం ఈ సినిమాలో విలన్ కుంభగా నటిస్తున్న పృద్విరాజ్ సుకుమారన్ నడవలేని స్థితిలో ఉంటారు. కేవలం కుడి చేయి మాత్రమే పనిచేస్తుంది. అనేక ఆయుధాలు బిగించబడిన యాంత్రికంగా కదిలే వీల్ చైర్లో కూర్చొని పోరాటాలు చేస్తున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్లో చూపారు.
ఈ సినిమాలో పృధ్వీరాజ్ సుకుమారన్, మాధవన్, ప్రియాంకా చోప్రా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఎల్లుండి జరుగబోయే ఈవెంట్లో మొదటిపాట విడుదల చేసి, సినిమా పేరు అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం.