ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురువారం ఉదయం ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయానికి వచ్చారు. తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకునేందుకు వచ్చారని సిబ్బంది చెప్పారు. ఆయన రవాణాశాఖ కార్యాలయంలో ఫోటో దిగి, రిజిస్టరులో సంతకం చేసి రెన్యువల్ చేసిన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని వెళ్ళిపోయారు.
రాజమౌళి-మహేష్ బాబు కలిసి చేస్తున్న ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ కోసం చాలా దేశాలలో పర్యటించాల్సి ఉంటుంది. కనుక రాజమౌళితో సహా సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నవారికి అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలా సౌకర్యంగా ఉంటుంది.
ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ ఒడిశాలో పూర్తయింది. త్వరలో రెండో షెడ్యూల్ హైదరాబాద్లో మొదలవబోతోంది.
దీనిలో సుమారు 3,000 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ దర్శకత్వంలో ఈ భారీ యాక్షన్ సీన్స్ షూటింగ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని కోసం హైదరాబాద్లో భారీ సెట్స్ వేస్తున్నారు.
ఈ షెడ్యూల్లో మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా, పృధ్వీరాజ్ సుకుమారన్ ముగ్గురూ కూడా పాల్గొనబోతున్నారు. నీళ్ళలో స్పీడ్ బోట్స్ యాక్షన్ సీన్స్ చేయడం కోసం ముగ్గురికీ ప్రత్యేక శిక్షణ ఇవ్వబోతున్నారట.
ఈ సినిమాకు సంగీతం: కీరవాణి, డైలాగ్స్: దేవాకట్ట అందిస్తున్నారు. సుమారు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్తో అంతర్జాతీయ స్థాయిలో కె ఎల్ నారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు.