హైదరాబాద్ నడిబొడ్డున అమీర్ పేట సమీపంలో వెంగళ్రావు నగర్లో ప్రభుత్వ భూమిలో వెలసిన ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. దాదాపు రెండెకరాల విస్తీర్ణంలో సుమారు 60 ఇళ్ళున్నాయి అక్కడ. భారీ పోలీస్ బందోబస్తు నడుమ హైడ్రా సిబ్బంది జేసీబీలతో ఇళ్ళను కూల్చివేస్తున్నారు.
దీంతో వాటిలో నివసిస్తున్న కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొందరు హైడ్రా సిబ్బందితో వాగ్వాదాలకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కానీ పోలీసుల సాయంతో ఇళ్ళు కూల్చివేశారు.
దాదాపు 50-60 ఏళ్ళుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని, ఇప్పుడు హటాత్తుగా జేసీబీలు పోలీసులతో వచ్చి ఇళ్ళు కూల్చివేస్తే తమ పరిస్థితి ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా ఉగాది పండుగ ముందు రోజున వచ్చి ఇళ్ళు కూల్చివేసి అందరినీ రోడ్డున పడేయడంతో స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయనాయకులు, బడాబాబులు చెరువులు ఆక్రమించి ఫామ్హౌసులు, కాలేజీలు కట్టుకున్నా వారి జోలికి వెళ్ళే సాహసం హైడ్రాకు లేదని, తమ వంటి పేదల మీదే ప్రతాపం చూపుతుందని బాధిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.