కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, జాహ్నవీ కపూర్ జంటగా చేసిన ‘దేవర’ సినిమా తర్వాత బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్తో కలిసి వార్-2 చేస్తున్న సంగతి తెలిసిందే. వార్-2లో జూ.ఎన్టీఆర్ చేయాల్సిన సన్నివేశాలన్నీ పూర్తిచేసేశారు. కనుక తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ తన 31వ సినిమా మొదలుపెట్టేందుకు సిద్దం అవుతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా జరిగింది. అప్పుడే ఓ పోస్టర్ కూడా విడుదల చేస్తూ సినిమా కాన్సెప్ట్ ఏమిటో డానిలోనే చెప్పేశారు కూడా.
“ఏ నేల అయితే రక్తంతో తడుస్తుందో దానిని ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి. అది అతని నేల, అతని సామ్రాజ్యం ... కానీ ఆ రక్తం ఖచ్చితంగా అతనిది కాదు,” అంటూ ఈ సినిమాలో కూడా భయంకరమైన రక్తపాతం తప్పదని హింట్ ఇచ్చేశారు. సంక్రాంతి తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఫిబ్రవరి నుంచి జూ.ఎన్టీఆర్ షూటింగ్లో పాల్గొంటారు. ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్కి జోడీగా కన్నడ నటి రుక్మిణీ వసంత్ నటించబోతున్నారు.
ఇప్పుడు తెలుగు సినిమాలు పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తీయడం చాలా సాధారణం అయిపోయింది. పైగా జూ.ఎన్టీఆర్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. కనుక ఈ సినిమాని కూడా మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి పాన్ ఇండియా మూవీగా తీయబోతున్నాయి.