క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హరిహర వీరమల్లు సినిమా టీజర్ త్వరలో విడుదల చేయబోతున్నట్లు మెగా సూర్య ప్రొడక్షన్స్ ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా సోషల్ మీడియాలో ప్రకటించింది.
“జై శ్రీరామ్... శ్రీరామ నవమి శుభాకాంక్షలతో మీ ముందుకు ‘ధర్మం కోసం యుద్ధం’ త్వరలో టీజర్ విడుదల అంటూ పవన్ కళ్యాణ్ తీక్షణంగా చూస్తున్న కళ్ళను మాత్రమే చూపిస్తూ ఓ పోస్టర్ కూడా పెట్టింది. అయితే టీజర్ ఎప్పుడు విడుదల చేయబోతోందో చెప్పలేదు.
హరిహర వీరమల్లు సినిమాని 2021లో మొదలుపెట్టారు కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చురుకుగా పాల్గొనవలసి రావడం, ప్రస్తుతం ఏపీ శాసనసభ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి జనసేన అభ్యర్ధిగా పోటీ చేస్తుండటంతో హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సినిమాలు ఇంతవరకు పూర్తి చేయలేకపోయారు.
బహుశః ఈసారి ఎన్నికలలో టిడిపి, జనసేన, బీజేపీల కూటమి గెలిచి ఏపీలో అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. కనుక మే 13న పోలింగ్ ముగిసినప్పటి నుంచి జూన్ 4న ఫలితాలు వెలువడేలోగా పవన్ కళ్యాణ్ ఈ రెండు సినిమాలకు సమయం కేటాయించి షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది.
హరిహర వీరమల్లు సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్లో ఏఎం రత్నం రూ.150 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియన్ లెవెల్లో 5 భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాంపాల్, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ, బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: క్రిష్, సంగీతం: ఎంఎం కీరవాణి, పాటలు: స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కెమెరా: జ్ఞానశేఖర్, ఎడిటింగ్: శ్రవణ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, శామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్.