కంగన వద్దనుకోవడమే ఇలియానాకు కలిసివచ్చింది

April 28, 2024


img

మహేష్‌ బాబు, పూరీ జగన్నాధ్ కాంబినేషన్‌లో పోకిరి సినిమా విడుదలై నేటికీ సరిగ్గా 18 ఏళ్ళు. మహేష్‌ బాబు, పూరీ జగన్నాధ్, ఇలియానాతో సహా  ఆ సినిమాలో నటించిన నటీనటులందరికీ మంచి గుర్తింపు లభించింది. ఆరోజుల్లో కేవలం రూ.10 కోట్లతో పోకిరీ తీస్తే, అది ఏకంగా రూ.70 కోట్లు కలక్షన్స్‌ రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. అప్పటివరకు మహేష్ బాబు చేసిన అన్ని సినిమాలలో ఆయన రూపురేఖలు, హెయిర్ స్టైల్ అన్నీ ఒకేలా ఉండేవి. కానీ దర్శకుడు పూరీ మహేష్ బాబుని పూర్తి భిన్నమైన రూపంలో చూపించడంతో అభిమానులు ఫిదా అయిపోయారు. 

ఇక ఈ సినిమాని ఇద్దరు బాలీవుడ్‌ హీరోయిన్లు చేజార్చుకున్నారు. మొదట హీరోయిన్‌గా ఆయెషా టకియాని అనుకోగా ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేక నో చెప్పేసింది. ఆ తర్వాత కంగనా రనౌత్ హీరోయిన్‌గా ఎంపికయింది. కానీ అదే సమయంలో ఆమె ‘గ్యాంగ్ స్టర్స్’ అనే హిందీ సినిమాలో అవకాశం రావడంతో ‘పోకిరి’ని వదులుకుంది. అప్పుడు ఇలియానకు ఈ సినిమాలో అవకాశం దక్కింది. ఈ ఒక్క సినిమా ఆమెను టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా చేసింది.

పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన తొలి సినిమా పవన్‌ కళ్యాణ్‌తో బద్రీ. కానీ దాని కంటే ఆరేళ్ళ ముందుగానే ఈ ‘పోకిరీ’ కధ వ్రాసుకొని దానిని పవన్‌ కళ్యాణ్‌ లేదా రవితేజలతో చేయాలనుకున్నారట. కానీ వారికి కుదరకపోవడంతో మహేష్‌ బాబుతో చేశారు. కనుక పవన్‌ కళ్యాణ్‌, రవి తేజ ఇద్దరూ కూడా ఈ సూపర్ హిట్ సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్నారు. 

పోకిరి సినిమాకు మొదట ఉత్తమ్ సింగ్‌ సన్నాఫ్ సూర్యనారాయణ అని పూరీ అనుకున్నారు. కానీ మహేష్‌ బాబు హీరోగా చేస్తున్నప్పుడు సినిమాకి ఆ టైటిల్‌ నప్పదని వెరైటీగా ‘పోకిరీ’ అని పెట్టారు. అది కూడా అప్పట్లో కొత్త ట్రెండ్ సృష్టించింది.   



Related Post

సినిమా స‌మీక్ష