మే 13న జరుగబోయే లోక్సభ ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్, బీఎస్పీలతో పాటు మరికొన్ని ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. తెలంగాణలో తొలిసారిగా తమిళనాడుకు చెందిన విడుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) పార్టీ కూడా పోటీ చేస్తోంది.
చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఈ వీసీకే పార్టీ తొలిసారిగా హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి పోటీ చేయబోతోంది. హైదరాబాద్ నుంచి వీసీకే అభ్యర్ధిగా జె.పద్మజా, సికింద్రాబాద్ నుంచి పగిడిపల్లి శ్యామ్ పోటీ చేయబోతున్నారు. వీరిద్దరూ నామినేషన్స్ వేసి అప్పుడే ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టేశారు.
గతంలో దళిత్ పాంథర్స్ ఇండియాగా పనిచేసిన ఈ పార్టీ పేరు మార్చుకొని వీసీకే పార్టీగా మారింది. తిరుమావలన్ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న ఈ పార్టీ తమిళనాడులో దళితుల హక్కుల కోసంనాలుగు దశాబ్ధాలుగా పోరాడుతోంది.