కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు ముగ్గురినీ జైలుకి పంపిస్తామని హెచ్చరించారు.
శనివారం జనగామలో ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయి అధికారం కోల్పోయినా, కల్వకుంట్ల కవిత తిహార్ జైలుకి వెళ్ళినా కేసీఆర్, కేటీఆర్లకు ఇంకా అహంకారం తగ్గలేదు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి చాలా చులకనగా మాట్లాడుతున్నారు. ఇలాగే నోటికి వచ్చిన్నట్లు వాగితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురినీ జైల్లో పడేస్తాము జాగ్రత్త. మా సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. కనుక ఇకనైనా వారు ముగ్గురూ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది.
ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్ కేసులలో విచారణ జరుగుతోంది. ఈ రెంటిలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురూ ఏదో రోజు జైలుకి వెళ్ళక తప్పదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయితే ముగ్గురూ బయటకు కూడా రాలేరు. ఆ కేసు కోర్టులో రుజువైతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో సహా కనీసం 30 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది,” అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు.