ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలోని మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరవింద ట్రావెల్స్ సంస్థకు చెందిన బస్సుని ఎదురుగా వచ్చిన టిప్పర్ వాహనం బలంగా ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగి ఐదుగురు సజీవ దహనమయ్యారు.
మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సుమారు 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కానీ ఈ ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
క్షతగాత్రులు తెలిపిన సమాచారం ప్రకారం వారందరూ పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన వారందరూ ఏపీలో ఓట్లు వేసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
మంగళవారం రాత్రి వారందరూ బాపట్ల జిల్లా చినగంజాం నుంచి అరవిందా ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్ బయలుదేరారు.
అర్దరాత్రి 1.30 గంటలకు చిలకలూరిపేట మండలంలోని అన్నంబట్ల-పసుమర్రు గ్రామాల మద్య కంకర లోడుతో ఎదురుగా దూసుకు వచ్చిన టిప్పర్ వాహనం బస్సును ఢీకొంది. ముందు టిప్పర్ వాహనంలో మంటలు చెలరేగగా, అవి బస్సుకు కూడా వ్యాపించాయి.
ప్రమాద సమయంలో బస్సులో అందరూ నిద్రిస్తుండటంతో ఏమి జరిగిందో గ్రహించేలోగానే మంటలు బస్సులోకి వ్యాపించడంతో ముగ్గురు ప్రయాణికులు వాటిలో చిక్కుకొని సజీవ దహనం అయిపోయారు.
వారిలో బస్సు డ్రైవర్ అంజి, కాశీ బ్రహ్మేశ్వర రావు (62), లక్ష్మి (58) శ్రీసాయి (9) ఉన్నారు. టిప్పర్ డ్రైవర్ హరిసింగ్ కూడా చనిపోయాడు. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మంటలు అంటుకొని గాయపడ్డారు.
ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న క్షతగాత్రులు 108 నంబరు, పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో వారు, అగ్నిమాపక సిబ్బందికి కూడా వెంటబెట్టుకొని ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడకు చేరుకొని మంటలు ఆర్పేసి బస్సులో చిక్కుకున్నవారిని బయటకు తీసి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.