మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు ఓ అరుదైన గౌరవం లభించబోతోంది. చెన్నైలో వేల్స్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ డిగ్రీ ప్రధానం చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 13న వేల్స్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రామ్ చరణ్ ముఖ్య అతిధిగా పాల్గొనవలసిందిగా ఆహ్వానించింది.
ఆరోజున యూనివర్సిటీ తరపున ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డీజి సీతారాం రామ్ చరణ్కు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయనున్నారు.
ఇంతకు ముందు వేల్స్ యూనివర్సిటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా గౌరవ డాక్టరేట్ ఇవ్వాలనుకుంది. అయితే సినీ పరిశ్రమలో తనకంటే గొప్ప నటీనటులు చాలా మందే ఉన్నారని ముందుగా వారిని సన్మానించాలంటూ పవన్ కళ్యాణ్ సున్నితంగా గౌరవ డాక్టరేట్ని తిరస్కరించారు.
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డ్ సాధించిన సంగతి తెలిసిందే. దాని తర్వాత శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న గేమ్ చేంజర్ సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కాబోతోంది. ఆ సినిమా విడుదల కాక ముందే బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ మరో సినిమా మొదలు పెట్టబోతున్నాడు.