ఎన్నికల సమయంలో సినీ పరిశ్రమలోని వారు ముఖ్యంగా నటీనటులు ఏదో ఓ రాజకీయ పార్టీలో చేరుతుండటం సర్వసాధారణ విషయమే. ఇప్పుడు ఆ జాబితాలో నటుడు నిఖిల్ సిద్దార్థ కూడా చేరాడు.
టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో నిఖిల్ శుక్రవారం టిడిపిలో చేరాడు. నారా లోకేష్ అతనికి కండువా కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న నిఖిల్ రాజకీయాలపై ఆసక్తితో చేరిన్నట్లు భావించనవసరం లేదు. అతని దగ్గర బంధువు టిడిపి అభ్యర్ధిగా చీరాల నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు.
కార్తికేయ-1,2 లతో హిట్ కొట్టి పాన్ ఇండియా హీరోగా ఎదిగిన నిఖిల్ ‘స్పై’ సినిమాతో బోర్లాపడ్డాడు. ప్రస్తుతం భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ‘స్వయంభూ’ అనే ఓ సినిమా, రామ్ వంశీ కృష్ణ దరశకత్వంలో ది ఇండియా హౌస్ అనే మరో సినిమా చేస్తున్నాడు. ది ఇండియా హౌస్ ఏప్రిల్ 14న విడుదల కాబోతుండగా, స్వయంభూ ఈ ఏడాది అక్టోబర్ 15న విడుదలవుతుంది.
ది ఇండియా హౌస్ సినిమాలో నిఖిల్ ప్రముఖ స్వాతంత్ర యోధుడు వీర్ సావర్కర్ పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధానపాత్ర చేస్తున్నారు. వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై సినీ నటుడు రామ్ చరణ్ అభిషేక్ అగర్వాల్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.