గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో 2015లో ధృవ నక్షత్రం షూటింగ్ మొదలైంది. కానీ నేటికీ ఆ సినిమా విడుదలవలేదు. ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలీదని గౌతమ్ నిరాశతో చెప్పారు. ఆ సినిమాకి ఎదురవుతున్న ఇబ్బందులు చూస్తుంటే ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తోందని, కానీ ఈ సినిమాపై పెట్టుబడి పెట్టినవారి కోసం అటువంటి ఆలోచనలు మానుకున్నానని చెప్పారు.
ఈ సినిమా గురించి తనతో పాటు తన భార్య కూడా ఆందోళన చెందుతోందని గౌతమ్ చెప్పారు. సినిమా పూర్తిచేసి రిలీజ్ చేయలేకపోతుండటం తనకు చాలా నిరాశ కలిగిస్తోందన్నారు.
విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమాని 2017లోనే విడుదల చేయాలనుకున్నప్పటికీ ఆర్ధిక సమస్యల వలన సినిమా ఆలస్యం అయ్యింది. వాటిని అధిగమించి 2018లో రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొని పోస్టర్ రిలీజ్ చేస్తే, గౌతమ్ మీనన్పై ఆల్ ఇన్ పిక్చర్స్ అధినేత మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు.
తమ బ్యానర్లో శింబుతో ఓ సినిమా చేస్తానని గౌతమ్ మీనన్ రూ.2.40 కోట్లు అడ్వాన్సుగా తీసుకొని, దానిని పక్కన పెట్టేసి, ధృవ నక్షత్రం తీసి రిలీజ్ చేసుకొంటున్నారని ఫిర్యాదు చేశారు. దాంతో ధృవ నక్షత్రం సినిమా రిలీజ్ చేయకుండా హైకోర్టు స్టే విధించింది.
అప్పటి నుంచి 5 ఏళ్ళుగా ధృవ నక్షత్రం సినిమా కోసం కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నామని, కానీ తీర్పు చెప్పకపోవడంతో సినిమాని రిలీజ్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని దర్శకుడు గౌతమ్ ఆవేదన వ్యక్తం చేశారు.
విక్రమ్ నటించిన పొన్నియన్ సెల్వన్ సినిమా తర్వాత గత ఏడాది డిసెంబర్ 8న ధృవ నక్షత్రం సినిమాని రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ చివరి నిమిషంలో వాయిదా వేసుకోక తప్పలేదని గౌతమ్ చెప్పారు. ధృవ నక్షత్రం సినిమా రిలీజ్ చేయలేకపోయినందుకు గౌతమ్ ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పుకున్నారు.
2023 పూర్తయ్యి 2024లో అప్పుడే రెండు నెలలు గడిచిపోయాయి. అయినా ధృవ నక్షత్రం సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీని పరిస్థితి నెలకొందని గౌతమ్ వాసుదేవ మీనన్ చెప్పారు.