తెలంగాణ ఆర్టీసీ సంస్థ హైదరాబాద్ నగర ప్రజలకు ఓ కొత్త సౌకర్యం అందుబాటులో తేబోతోంది. ఇంటి నుంచి బస్టాండ్స్ వరకు, అదేవిధంగా బస్టాండ్ల నుంచి ఇంటి వరకు విద్యుత్ ఆటో సేవలను అందుబాటులోకి తేబోతోంది. దీని కోసం ఆర్టీసీ ఓ మొబైల్ యాప్ రూపొందిస్తోంది. త్వరలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఆర్టీసీ బస్సులలో ఇతర జిల్లాలకు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్ళేవారు, అదేవిదంగా ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ వస్తున్నవారు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకుంటున్నప్పుడే ఈ-ఆటో సేవలకు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
అప్పుడు ఇంటి వద్దకు ఆటో వస్తుంది. దానిలో బస్టాండ్ చేరుకోవచ్చు. అదేవిధంగా వేరే ఊర్ల నుంచి హైదరాబాద్ చేరుకునేవారు కూడా బస్ టికెట్తో పాటు ఈ ఆటో సేవలు కూడా బుక్ చేసుకున్నట్లయితే, సరిగ్గా బస్సు వచ్చే సమయానికి బస్టాండ్ వద్ద ఆటో సిద్ధంగా ఉంటుంది. దానిలో సురక్షితంగా ఇంటికి చేరుకోవచ్చు.
ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు ఇంచుమించు ఇటువంటి సేవలు చాలా కాలం నుంచే అందిస్తున్నాయి. నగరంలో కొన్ని పికప్ పాయింట్స్ వద్ద నుంచి మినీ బస్సులు, వ్యానులలో ప్రయాణికులను నగర శివారులో బస్సులు బయలుదేరే చోటికి చేర్చుతున్నాయి.
ఊబర్, రాపిడో, ఓలా వంటి సంస్థలు కూడా ఇలాంటి సౌకర్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. కనుక ఆర్టీసీ ప్రవేశపెట్టబోతున్న ఈ సేవలు నగర ప్రజలకు మరింత సౌకర్యంగా గమ్యస్థానాలు చేరుకునేందుకు తోడ్పడతాయి.