తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో తెలంగాణ జాగృతి బోణీ కొట్టింది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో వడ్డేపల్లి మున్సిపాలిటీలో మొత్తం 8 సీట్లు ఫార్వార్డ్ బ్లాక్, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో సీటు దక్కించుకున్నాయి.
తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీ కాదు. కనుక కల్వకుంట్ల కవిత ఫార్వార్డ్ బ్లాక్తో ఒప్పందం చేసుకొని ఆ పార్టీ తరపున తమ అభ్యర్ధులను వడ్డేపల్లి నుంచి బరిలో దించారు. తొలి ప్రయత్నంలోనే మొత్తం 10 స్థానాలలో 8 తెలంగాణ జాగృతి దక్కించుకుంది. కనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి బయట పడిన తర్వాత కల్వకుంట్ల కవితకు ఇదే తొలి విజయం.
ఒకవేళ ఆమె అభ్యర్ధులు లేకపోయి ఉంటే ఈ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీకి దక్కి ఉండేది. కనుక కవిత రాజకీయాలతో ఓట్లు చీలితే బీఆర్ఎస్ పార్టీ నష్టపోతుందని స్పష్టమైంది.
ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఊహించినట్లే మెజార్టీ మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, వాటిలో వార్డులు, డివిజన్లు గెలుచుకుంటున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కూడా బాగానే గెలుచుకుంటోంది.
ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో నిలుస్తుండటం అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రమాద ఘంటిక వంటిదే అని భావించవచ్చు.