తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “2027 మార్చిలో కేంద్ర ప్రభుత్వం జనగణన కార్యక్రమం చేపట్టబోతోంది. అది పూర్తయిన తర్వాత ఆ లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది.
ఆ తర్వాత 2029లో జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అప్పుడే తెలంగాణ శాసనసభకు కూడా ఎన్నికలు జరుగుతాయి. అప్పటి వరకు మా ప్రభుత్వం వరకు అధికారంలో ఉంటుంది. అంటే నేను ఐదున్నరేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నాను. ఆ తర్వాత కూడా మరో ఐదేళ్ళు నేనే సిఎంగా ఉంటాను! తెలంగాణలో మరో 15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుంది,” అని చెప్పారు.
ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి సరదాగా ‘మరో పదేళ్ళ వరకు తెలంగాణలో నేనే రాజు నేనే మంత్రి,” అని అన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఎవరూ సిఎం పదవి ఆశించవద్దని, అలాగే ప్రభుత్వంలో కీలక నిర్ణయాలన్నీ నేనే తీసుకుంటానని సిఎం రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారు.
మరోసారి కూడా నేనే సిఎంగా ఉంటానని, 2029లో జమిలి ఎన్నికలకు వెళ్తామని రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రకటించడమే ఇందుకు ఓ చిన్న ఉదాహరణగా భావించవచ్చు.