మేడారం సమ్మక్క సారలక్క జాతరకు ఈసారి ఆరు నెలలు ముందుగానే పనులు మొదలుపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. కానీ వీటిలో ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకొంటుండటంపై మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా మంత్రికి వరంగల్, ములుగు జిల్లాలలో ఏం పని? ఇక్కడి పనులు, రాజకీయాలలో అయన వేలేందుకు పెడుతున్నారు? అని కొండా దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా మురళి నేరుగా సోనియా, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లకు మంత్రి పొంగులేటిపై పిర్యాదులు చేశారు.
ఇటీవలే ఇద్దరు సీనియర్ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మద్య వివాదం చెలరేగితే కాంగ్రెస్ పెద్దలు జోక్యం చేసుకొని ఇద్దరికీ నచ్చజెప్పి ఆ వ్యవహారాన్ని చల్లార్చారు. ఇంతలోనే మళ్ళీ మరో సీనియర్ మంత్రులు పొంగులేటి, కొండా సురేఖల మద్య ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి మళ్ళీ తలనొప్పులు మొదలయ్యాయి.