ఇండిగో ఎయిర్ లైన్స్ సంక్షోభం వరుసగా నేడు ఆరో రోజు కూడా కొనసాగింది. ఒక్క శంషాబాద్ నుంచే 115 ఇండిగోలు రద్దు అవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఇతర ప్రాంతాల నుంచి శంషాబాద్కి 54 విమానాలు రావాల్సి ఉండగా అవన్నీ రద్దు అయ్యాయి. కనుక ఆయా ప్రాంతాల నుంచి హైదరాబాద్ బయలుదేరినవారు అక్కడ చిక్కుకుపోయారు.
అలాగే హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు బయలుదేరాల్సిన 61 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఈ సమస్య తీవ్రతని దృష్టిలో ఉంచుకొని స్పైస్ జెట్ సంస్థ అదనంగా వంద విమానాలు నడిపిస్తోంది. కానీ దేశవ్యాప్తంగా వందల కొద్దీ ఇండిగో విమానాలు నిలిచిపోయిన కారణంగా స్పైస్ జెట్ విమానాలు సరిపోవని వేరే చెప్పక్కర లేదు.
ఆరు రోజులుగా ఇండిగోలో ఇంత సంక్షోభం నెలకొని ఉంటే ఆ సంస్థ, కేంద్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి చేపట్టిన చర్యలు ఏమాత్రం ఫలించడం లేదు.
ఇప్పుడు అందరి దృష్టి పౌరవిమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడుపై పడటంతో ఆయన తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. వారం రోజులైనా ఈ సమస్య పరిష్కరించలేకపోయినందుకు ప్రధాని మోడీ ఆయనపై వేటు వేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక నేడో రేపో ఇండిగో మళ్ళీ గాడిన పడితే పర్వాలేదు. లేకుంటే అందరికీ ఇబ్బందులు తప్పవు.