వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైళ్ళు వస్తున్నాయని చాలా కాలంగానే వింటున్నాము. నేడు తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ సేవలు మొదలయ్యాయి. ప్రధాని మోడీ కొల్కతాలో హౌరా రైల్వే స్టేషన్లో పచ్చ జెండా ఊపి వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలుకి ప్రారంభోత్సవం చేశారు. ఇది హౌరా- అస్సాంలోని గౌహాతీ (కామాఖ్య) మద్య రాకపోకలు సాగిస్తుంది.
అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఈ రైలులో వెయిటింగ్ లిస్టులు ఉండవు. కేవలం కన్ఫారం టికెట్స్ మాత్రమే జారీ చేస్తారు. కనీస ఛార్జీ 400 కిమీలకు ఖరారు చేశారు. అంటే జీరో నుంచి 400 కిమీ మద్యలో ఎక్కడ దిగిపోయినా 400 కిమీ దూరానికి కనీస ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందన్న మాట!
దీనిలో థర్డ్ ఏసీ టికెట్ ఛార్జీ కిమీకు రూ.2.40గా నిర్ణయించారు. ఈ లెక్కన రెండవ స్టేషన్ వరకు మాత్రమే ప్రయాణించాలన్నా (400 కిమీలకు) రూ.960 చెల్లించాల్సి ఉంటుంది. అదే సెకండ్ ఏసీకైతే కిమీకు రూ.3.10 పైసలు (కనీస ఛార్జీ రూ.1,240) ఫస్ట్ ఏసీ కిమీకు రూ.3.80 (కనీస ఛార్జీ రూ.1,520)గా రైల్వేశాఖ నిర్ణయించింది.
హోరా నుంచి గౌహతీకి థర్డ్ ఏసీలో సుమారు రూ.2,300, సెకండ్ ఏసీలో రూ.3,000, ఫస్ట్ ఏసీలో రూ. 3,600 ఛార్జీ ఉంటుంది. దీనిలో టీటిఫిన్, భోజనం ఛార్జీలు కలిపి ఉంటాయి. కానీ వీటికి జీఎస్టీ అదనం.
ఈ రైలు మహిళలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ కోటా మాత్రమే ఉంటుంది. వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైళ్ళలో మొత్తం 16 కోచ్లు ఉంటాయి. వాటిలో థర్డ్ ఏసీ 11, సెకండ్ ఏసీ 4, ఫస్ట్ ఏసీ 1 ఉంటాయి. ఈ రైలు గంటకు 160 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది.