బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేసి వివరణ తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ వారిలో అరికేపూడి గాంధీ (శేరిలింగంపల్లి), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల), డా.సంజయ్ (జగిత్యాల), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్చెరు), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), కాలె యాదయ్య (చేవెళ్ళ), తెల్లం వెంకట్రావు (భద్రాచలం) తాము నేటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని స్పీకర్కి లిఖితపూర్వకంగా తెలియజేశారు.
కనుక వారి వివరణలపై బీఆర్ఎస్ పార్టీకి అభ్యంతరాలు ఏవైనా ఉంటే తెలియజేయాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజులలోగా అభ్యంతరాలు తెలియజేయాలని కోరారు.
ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), దానం నాగేందర్ (ఖైరతాబాద్) మాత్రం ఇంతవరకు వివరణ ఇవ్వలేదని సమాచారం. వారిలో కడియం శ్రీహరి తాను పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని మీడియాకు చెప్పారు.
కనుక ఫిరాయింపు ఎమ్మెల్యేల కధలో ఇలా మొదలైన మరో ఎపిసోడ్ ఎప్పుడు ఏవిదంగా ముగుస్తుందో చూడాలి.