మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ప్రతీ రెండేళ్ళకోసారి ఫిబ్రవరి నెలలో జరుగుతుంది. 2024 ఫిబ్రవరిలో మహా జాతర జరిగింది కనుక మళ్ళీ 2026 ఫిబ్రవరిలో జరుగబోతోంది. అంటే 9 నెలలపైనే సమయం ఉందన్న మాట! కానీ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే మేడారం మహా జాతరకు సన్నాహాలు ప్రారంభించడం విశేషం.
రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి సీతక్క మంగళవారం ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ కార్యాలయంతో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యి మేడారం మహా జాతరకు చేయాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.145 కోట్లు మంజూరు చేస్తుందని మంత్రి సీతక్క చెప్పారు.
ఏటా జాతరకు రెండు నెలల ముందు పనులు మొదలుపెట్టి సకాలంలో పూర్తి చేయడానికి చాలా హడావుడి పడుతుండటం పరిపాటిగా మారిందని, కానీ ఈసారి ఆరు నెలల ముందుగా పనులు మొదలుపెట్టి అన్నీ నాణ్యంగా చేయాలని మంత్రి సీతక్క సూచించారు. జంపన్నవాగులో స్నానాలు చేసే భక్తులు కోసం రూ.5 కోట్లతో వసతి సౌకర్యం కల్పించాలని మంత్రి సీతక్క సూచించారు.
మరుగు దొడ్లు, త్రాగునీరు, భక్తులు సేద తీరేందుకు ఎక్కడికక్కడ సిమెంట్ కుర్చీలు వగైరా ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్క అధికారులను కోరారు. మహా జాతరకు కోటి మందికి పైగా భక్తులు తరలివస్తుంటారు కనుక వారి భద్రత కోసం ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టాలని మంత్రి సీతక్క సూచించారు.