ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి మూడు వైపులా మరో మూడు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్ (టిమ్స్) (హాస్పిటల్స్)ను నిర్మించాలని నిర్ణయించింది. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,679 కోట్లు ఖర్చు చేయనుంది.
రాష్ట్రంలో కరోనా ఉదృతంగా ఉన్నప్పుడు కరోనా రోగులకు చికిత్స కోసం రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో భవనాలకు యుద్ధ ప్రాతిపదికన అవసరమైన మార్పులు చేర్పులు చేసి టిమ్స్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కరోనా తీవ్రత తగ్గిన తరువాత దానిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.
ఇప్పుడు దానికి అదనంగా నగరంలో మూడు వైపులా అంటే ఎల్బీ నగర్, ఆల్వాల్, సనత్ నగర్ వద్ద మరో మూడు టిమ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటిలో ఎల్బీ నగర్, ఆల్వాల్ టిమ్స్ కొరకు చెరో రూ.900 కోట్లు, సనత్ నగర్ టిమ్స్ కొరకు రూ.897 కోట్లు ఖర్చు చేయబోతోంది.
ఈ మూడు టిమ్స్ ఏర్పాటుతో నగరంలోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్ హాస్పిటల్స్పై ఒత్తిడి కూడా తగ్గుతుంది. నగరం నలువైపులా నాలుగు టిమ్స్ ఏర్పాటు చేయడం వలన ఆయా ప్రాంతాల ప్రజలకు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. వీటి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.