సోషల్ మీడియా వచ్చిన తరువాత కొంతమంది తమ సృజనాత్మకతను రకరకాలుగా ప్రదర్శిస్తున్నారు. కొందరు తమ అభిమాన హీరోల సినిమా పేరు లేదా ఫస్ట్-లుక్ పోస్టర్ రూపొందించి అవే అసలైనవని ప్రచారం చేస్తుంటే, మరికొందరు బ్రతికున్న ప్రముఖులను చంపేస్తున్నారు. సోషల్ మీడియా ‘ఇదిగో పులి...’ అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ‘అదిగో తోక..’ అంటూ నిజానిజాలు నిర్ధారించుకోకుండా వార్తలు ప్రచురించేస్తోంది. దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం కోసం కేంద్రం బ్యాంకుల చెక్కుబుక్కులను రద్దు చేయబోతోందంటూ మీడియాలో ప్రముఖంగా వచ్చిన వార్త కూడా అటువంటి గాలివార్తేనని కేంద్ర ఆర్ధికశాఖ స్పష్టం చేసింది. అటువంటి ఆలోచన, ప్రతిపాదనలు తమ పరిశీలనలో లేవని స్పష్టం చేసింది.