తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గల డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కొరకు డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ (దోస్త్) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభం అయ్యింది. ఈ నెల 25లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్దులు దరఖాస్తుతో పాటు అభ్యర్ధులు రూ.200 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో మొత్తం 1,054 డిగ్రీ కాలేజీలున్నాయి. వాటిలో 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 855 ప్రైవేట్ కాలేజీలు, 63 నాన్-దోస్త్ కాలేజీలు ఉన్నాయి.
ఈ కాలేజీలన్నిటిలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సులలో మొత్తం 3,86,544 డిగ్రీ సీట్లు విద్యార్దులకు అందుబాటులో ఉన్నాయి.
దోస్త్ ద్వారా మూడు విడతలలో ఆయా కాలేజీలలో ప్రవేశాలు కల్పిస్తారు.
మొదటి విడత: మే 6 నుంచి 25 వరకు రిజిస్ట్రేషన్స్, మే 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, జూన్ 3న సీట్ల కేటాయింపు. జూన్ 4 నుంచి 10 లోగా ఎంచుకున్న కళాశాలలో విద్యార్దులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
రెండో విడత: జూన్ 4 నుంచి 13 వరకు రిజిస్ట్రేషన్స్, జూన్ 14వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, జూన్ 18న సీట్లను కేటాయింపు, జూన్ 19 నుంచి 24 విద్యార్దులు ఎంచుకున్న కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
మూడో విడత: జూన్ 19 నుంచి రిజిస్ట్రేషన్స్, జూన్ 25వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, జూన్ 19 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్స్, జూన్ 29న సీట్ల కేటాయింపు, జులై 8లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
జులై 8వ తేదీ నుంచి అన్ని కళాశాలల్లో ఒకేసాసారి తరగతులు ప్రారంభం అవుతాయని విద్యాశాఖ తెలియజేసింది.