తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు దరఖాస్తులు సమర్పించేందుకు గడువు నేటితో ముగుస్తుండటంతో ప్రభుత్వం ఈ నెల 20 వరకు పొడిగించింది. నేటి నుంచి 20వ తేదీ వరకు అభ్యర్ధులు తమ దరఖాస్తులలో దొర్లిన తప్పులను సరిచేసుకునేందుకు కూడా అవకాశం కల్పించింది.
గత ఏడాది టెట్ పరీక్షకు 2.91 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఈ ఏడాది కేవలం 1.93 లక్షలమంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. కనుక మరింతమందికి అవకాశం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెట్ గడువు పొడిగించింది.
టెట్ పరీక్ష మే 20 నుంచి ప్రారంభం కానున్నాయి. డీఎస్సీలో టెట్ అర్హత సాధించినవారికి అదనంగా 20 శాతం వెయిటేజ్ ఉంటుంది. కనుక ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారందరూ టెట్ పరీక్షలు వ్రాస్తుంటారు. తెలంగాణలో టెట్ అర్హత సాధించినవారు 2.50 లక్షలకు పైగా ఉన్నారు.