దేశంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మరో కొత్త వ్యాపారం ప్రారంభించింది. సామాన్య, మద్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో అంటే రూ.600 లోపుగా బట్టలు, చెప్పులు, గృహోపకరణాలు తదితర ఉత్పత్తులను అమెజాన్ బజార్ ద్వారా అందించబోతోంది.
దేశం నలుమూలల నుంచి ఆయా ఉత్పత్తిదారుల వద్ద నుంచి సేకరించిన ఉత్పత్తులను అమెజాన్ బజార్లో ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది. వీటిని కూడా ఆన్లైన్లో కొనుగోలు చేస్తే డోర్ డెలివరీ అందిస్తుంది.
దీని కోసం అమెజాన్ సంస్థ ఓ మొబైల్ యాప్ ఏర్పాటు చేసింది. దానిని మొబైల్ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా అవసరమైనా వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
మరో దిగ్గజ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే షాప్సీ ద్వారా ఈ రకం వ్యాపారంలో దూసుకుపోతోంది. మిషో సంస్థ కూడా తక్కువ ధర ఉత్పత్తులను ప్రజలకు అందించడంలో మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు అమెజాన్ కూడా బజార్తో వాటితో పోటీకి సిద్దమైంది.
ఈ కామర్స్ సంస్థలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు మొదలు పప్పులు, నూనెలు, సబ్బులు వంటి నిత్యావసర సరుకులను ఆన్లైన్లో బుక్ చేస్తే ఇంటికే వచ్చేస్తుండటంతో, దేశంలో ఈ కామర్స్ బిజినెస్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.
వీటి వలన దేశం నలుమూలలలో తయారయ్యే వివిద రకాల ఉత్పత్తులను వాటి తయారీదారులు అమ్ముకోగలుగుతున్నారు. ప్రజలకు అనేక వెరైటీ ఉత్పత్తులు సరసమైన ధరలకే లభిస్తున్నాయి.
అయితే ఈ కామర్స్ బిజినెస్ మొదలైన తర్వాత పెద్ద పెద్ద షోరూములు మొదలు గల్లీలో కిరాణా దుకాణాల వరకు చాలా నష్టపోతున్నాయి. కానీ ప్రతీ దానిలో కొంత మంచితో పాటు కొంత దుష్పరిమాణాలు కూడా ఉంటాయి కనుక కాలానుగుణంగా మార్పులు తప్పవు.