కేంద్ర ప్రభుత్వం హటాత్తుగా రూ.2,000 నోట్లను మార్కెట్ నుండి ఉపసంహరించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందిస్తూ, “500 అనుమానాలు, 1,000 మిస్టరీలు, 2,000 తప్పులు... వీటి ఫలితమే కర్ణాటకలో బిజెపి ఓటమి. వీటన్నిటినీ కప్పిపుచ్చుకొనేందుకు ఒకటే ట్రిక్ ఉంది. అదే.. ఇది,” అని ట్వీట్ చేశారు.
అయితే అసలు పెద్దనోట్లు రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం రూ.2,000 నోట్లు ఎందుకు ప్రవేశపెట్టింది? మళ్ళీ ఇప్పుడు ఎందుకు రద్దు చేస్తోంది? అనే సామాన్య ప్రజల సందేహాలకు కేంద్ర ఆర్ధికశాఖ కార్యదర్శి టీవీ సోమనాధన్ సహేతుకమైన సమాధానం చెప్పారు.
2016లో పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత హటాత్తుగా దేశంలో కరెన్సీ కొరత ఏర్పడింది. కనుక దానిని తీర్చేందుకే రూ.2,000 నాట్లను ముద్రించాము. కానీ ఆ తర్వాత నుంచి క్రమంగా నగదురహిత లావాదేవీలు భారీగా పెరగడంతో రూ.2000 నోట్ల అవసరం తగ్గిపోయింది. కనుకనే వాటి ముద్రణ నిలిపివేసింది. ఇప్పుడు వాటిని ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నోట్లను ఉపసంహరించినా మార్కెట్లపై ఎటువంటి ప్రభావమూ పడదు. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఆన్లైన్ లేదా నగదురహిత లావాదేవీలే జరుగుతున్నాయి కనుక,” అని తెలిపారు.