హైదరాబాద్లో అమెజాన్ వెబ్ సర్వీసస్ హైదరాబాద్లో మరోసారి భారీ పెట్టుబడి పెట్టబోతోంది. రెండేళ్ల క్రితం హైదరాబాద్ రూ.20,096 కోట్లు పెట్టుబడితో భారీ డేటా సెంటర్ ఏర్పాటుచేయబోతున్నట్లు ప్రకటించి, చందన్వెల్లి, ఫ్యాబ్ సిటీ, ఫార్మా సిటీలలో మూడు డేటా సెంటర్స్ ఏర్పాటు చేసింది. వాటి మొదటి దశ పనులు పూర్తయి సంస్థ కార్యకలాపాలు కూడా ప్రారంభం అయ్యాయి.ఈ సందర్భంగా ఆ సంస్థ 2030లోగా దశలవారీగా వాటి విస్తరణకు మరో రూ.16,204 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది. అంటే హైదరాబాద్లో అమెజాన్ వెబ్ సర్వీసస్ మొత్తం పెట్టుబడి రూ.36,300 కోట్లు కాబోతోందన్న మాట! శుక్రవారం హైదరాబాద్ నగరంలోని హెచ్ఐసీసీలో జరిగిన “ఏడబ్ల్యూఎస్ ఎంపవర్మెంట్ ఇండియా’ సమావేశంలో అమెజాన్ వెబ్ సర్వీసస్ ఈ ప్రకటన చేసింది.
ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టిన సంస్థలలో అమెజాన్ వెబ్ సర్వీసస్ ఒకటని, దానికి ప్రభుత్వం తరపున అన్నివిధాలుగా సహాయసహకారాలు అందిస్తామని, అలాగే దాని సేవలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో వినియోగించుకొంటుందని అన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసస్ ఈ డేటా సెంటర్స్ ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో స్టార్టప్ కంపెనీలకి ఎంతగానో లభి పొందుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు.
అమెజాన్ వెబ్ సర్వీసస్ ఈ డేటా సెంటర్స్ ద్వారా వివిద ప్రభుత్వ, ప్రవేట్ సంస్థలకి, ప్రభుత్వ కార్యాలయాలకి క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు అందిస్తుంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ-గవర్నెన్స్, హెల్త్ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తదితర రంగాలలో ఈ డేటా సెంటర్స్ సేవలని వినియోగించుకొంటోంది.