ఈ నెల 15వ తేదీ నుంచి సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్ మద్య ప్రారంభం కాబోతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళ టైమింగ్స్ ఖరారయ్యాయి. విశాఖపట్నం నుంచి ప్రతీరోజు ఉదయం 5.45 గంటలకి బయలుదేరి మధ్యాహ్నం 2.25 గంటలకి సికింద్రాబాద్ చేరుకొంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 2.45 గంటలకి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 11.25 గంటలకి విశాఖపట్నం చేరుకొంటుంది. మొదట కొన్ని రోజులపాటు వారానికి ఆరు రోజులే నడిపించబోతున్నట్లు వరంగల్ కమర్షియల్ రైల్వే ఇన్స్పెక్టర్ తెలిపారు. కనుక ఆదివారం సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళు అందుబాటులో ఉండవు.
జనవరి 15వ తేదీన తొలిరోజున వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 10వ నంబర్ ప్లాట్ఫారం నుంచి ఉదయం 10 గంటలకి బయలుదేరి రాత్రి 8.30 గంటలకి విశాఖపట్నం చేరుకొంటుంది. గంటకి 130-160 కిమీ వేగంతో ఈ రైళ్ళు ప్రయాణిస్తూ తక్కువ సమయంలో గమ్యం చేరుకోవలసి ఉంటుంది కనుక మద్యలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఆగుతాయి.
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళలో టికెట్స్ రిజర్వేషన్ కోసం ఐఆర్సీటీసీలో ఇంకా లిస్టింగ్ చేయలేదు. ఈరోజు సాయంత్రంలోగా వీటిని జాబితాలో జోడించవచ్చని తెలుస్తోంది. అప్పుడే వీటి టికెట్ ఛార్జీలపై స్పష్టత వస్తుంది. తాజా సమాచారం ప్రకారం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకి చైర్ కార్లో రూ.1665, బిజినెస్ క్లాస్లో సుమారు రూ.3,000 ఉండవచ్చని తెలుస్తోంది.