హైదరాబాద్లో మెట్రో రైళ్ళన్నీ పిల్లర్ల మీద నిర్మించిన రైల్వే ట్రాక్లపైనే తిరుగుతున్నాయి. ఇప్పుడు భూగర్భలైన్ (అండర్ గ్రౌండ్) కూడా రాబోతోంది. హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ & టీ ఎంఆర్హెచ్ఎల్ సంస్థ ఎండీ, సీఈఓ కెవీబీ రెడ్డి ఈ విషయం నిన్న ప్రకటించారు. హైదరాబాద్ మెట్రో ప్రారంభం అయ్యి నిన్నటికి 5 సం.లు పూర్తయిన సందర్భంగా అమీర్ పేట్ మెట్రో స్టేషన్లో జరిగిన వేడుకలలో పాల్గొన్న వారు మెట్రోకి సంబందించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. అమీర్ పేట్ మెట్రో స్టేషన్లో తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింబించే పలు సాంస్కృతిక కళా ప్రదర్శనలు కూడా జరిగాయి.
• ప్రస్తుతం అన్ని మార్గాలలో కలిపి రోజుకి 4.40 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఈ 5 ఏళ్లలో అన్ని మార్గాలలో కలిపి మొత్తం 31 కోట్ల మంది మెట్రోలో ప్రయాణించారు.
• మెట్రో రెండో దశలో భాగంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కిమీ మెట్రో లైన్ నిర్మింస్తాం. దీనిలో విమానాశ్రయం సమీపంలో సుమారు 2.5కిమీ మేర భూగర్భంలో నిర్మిస్తాం.
• ఈ పనులకు సిఎం కేసీఆర్ డిసెంబర్ 9న శంకుస్థాపన చేస్తారు.
• ఈ కారిడార్ నిర్మించేందుకు అయ్యే రూ.6,250 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.
• రాయదుర్గం-శంషాబాద్, నాగోల్-ఎల్బీ నగర్ మార్గం కూడా అందుబాటులోకి వస్తే మెట్రో ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అవుతుందని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి, కేవీబి రెడ్డి మెట్రో ప్రయాణికులకు బహుమతులు అందజేశారు. హైదరాబాద్ మెట్రోని అదరిస్తూ విజయవంతంగా నడిచేందుకు తోడ్పడుతున్న మెట్రో ప్రయాణికులకి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.