టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఆ సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఓ శుభవార్త చెప్పారు. అక్టోబర్ వేతనంలో ఉద్యోగులందరికీ వేతనంతో పాటు ఒక డీఏ అదనంగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. నిన్న ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, “నేను టీఎస్ఆర్టీసీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో టీఎస్ఆర్టీసీని నష్టాల ఊబిలో నుంచి బయటకు తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నందుకు చాలా సంతృప్తిగా ఉంది. వచ్చే నెల జీతంలో ఉద్యోగులందరికీ ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయించాము. టీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టాలనే ఉద్యోగుల నుంచి అభ్యర్ధనలు వస్తున్నాయి. త్వరలోనే విడతల వారీగా 1200 కారుణ్య నియామకాలు చేపడతాము. 300 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తున్నాము. త్వరలోనే వాటిని టీఎస్ఆర్టీసీలో ప్రవేశపెట్టబోతున్నాము.
టీఎస్ఆర్టీసీ బ్రాండింగ్తో త్వరలోనే ‘జీవా వాటర్ బాటిల్స్’ ప్రారంభించబోతున్నాము. ఈ ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రంలో అన్ని టీఎస్ఆర్టీసీ డిపోలను లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రచించి అమలుచేస్తున్నాము. వచ్చే ఏడాదినాటికి వీటి ఫలితాలు కనిపిస్తాయి. టీఎస్ఆర్టీసీని మళ్ళీ లాభాలబాట పట్టించేందుకు కృషి చేస్తున్న టీఎస్ఆర్టీసీ ఎండీ వీసి సజ్జనార్, రీజియనల్, డిపో మేనేజర్లు, ఉద్యోగులు, సిబ్బంది అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను,” అని అన్నారు.