నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు నడుపుతామని టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారి యాదగిరి తెలియజేశారు. నేటి నుండి లాక్డౌన్ సడలింపు సమయాన్ని సాయంత్రం 6 వరకు పొడిగించడంతో రాష్ట్రవ్యాప్తంగా 3,600 బస్సులను నడిపిస్తామని చెప్పారు. ఇవికాక హైదరాబాద్లో 800 సిటీ బస్సులను కూడా తిప్పుతామని చెప్పారు. హైదరాబాద్ పరిధిలో ఉదయం 6.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు బస్ పాస్ కౌంటర్లు కూడా పనిచేస్తాయని తెలిపారు. కానీ కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సత్తుపల్లి, మధిర, నల్గొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి లాక్డౌన్ అమలుకానుంది కనుక ఆ ఏడు నియోజకవర్గాలలో మధ్యాహ్నం 2గంటలకు బస్ సర్వీసులు నిలిపివేస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు అంతర్ రాష్ట్ర సర్వీసులను నడుపబోమని తెలిపారు.