రష్యా తయారుచేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ను భారత్లో అత్యవసర వినియోగానికి అనుమతి లభించడంతో నేటి నుండి హైదరాబాద్, విశాఖపట్టణం నగరాలలో అపోలో ఆసుపత్రులలో లాంఛనంగా ఈ టీకాలు వేసే కార్యక్రమం మొదలుపెట్టారు.
అపోలో గ్రూప్ ప్రెసిడెంట్ డాక్టర్ కె హరిప్రసాద్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సీఈవో ఎంవి రమణ హైదరాబాద్లో అపోలో ఆసుపత్రిలో నేడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉద్యోగి అశోక్కు తొలి టీకా వేశారు.
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సంస్థ స్పుత్నిక్ వి వాక్సిన్ ఉత్పత్తి, పంపిణీ కోసం రష్యాకు చెందిన డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సంస్థతో ఒప్పందం చేసుకొని ముందుగా రష్యా నుంచి వాక్సిన్లను దిగుమతి చేసుకొంది. వాటినే ఇప్పుడు అపోలో ఆసుపత్రుల ద్వారా అందజేస్తోంది. ఈ ఏడాది జూలై నెల నుంచి వాక్సిన్ల ఉత్పత్తి ప్రారంభించబోతోంది.
స్పుత్నిక్ వి వాక్సిన్ ఒక్క డోస్ ధర జీఎస్టీతో కలిపి రూ.945గా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నిర్ణయించింది. ఇది ఒక్క డోస్ వేసుకొంటే సరిపోతుంది. కోవీషీల్డ్, కోవాక్సిన్లలాగా రెండు డోసులు అవసరం లేదు. ఈ వాక్సిన్ వేసుకొనేందుకు కోవిన్ మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది.