ఢిల్లీలోని మాలవీయ నగర్లో గల లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో బుధవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 21 మంది చనిపోగా మరో 20 మందిని స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి కాపాడారు. మృతులలో విదేశీయులు ఎక్కువ మంది ఉన్నట్లు సమాచారం.
ఐదు అంతస్తుల భవనంలోని బేస్మెంట్లో వంటశాల ఉంది. అక్కడే షార్ట్ సర్క్యూట్ జరిగి శరవేగంగా మంటలు భవనం అంతా వ్యాపించాయి. స్థానిక యువకులు చాలా చురుకుగా స్పందించి వీలైనంత మందిని బయటకు తీసుకువచ్చారు.
పై అంతస్తులలో చిక్కుకున్నవారిని కిందకు దించేందుకు అవకాశం లేకపోవడంతో కొన్ని పరుపులు పేర్చి వాటిపై దూకమని ప్రోత్సహించడంతో కొందరు ఆవిధంగా కూడా ప్రాణాలు కాపాడుకున్నారు. వారిలో ఒక పసికందుతో ఉన్న మహిళ కూడా ఉన్నారు. ఒకరిద్దరు పక్కకు పడటంతో కాళ్ళు, చేతులు ఫ్రాక్చర్ అయ్యాయి. గాయపడ్డవారిని సమీపంలో ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వైద్యం కోసం వచ్చేవారు ఎక్కువగా ఇక్కడి హోటల్స్లో దిగుతుంటారని స్థానికులు తెలిపారు.