బిహార్ సిఎంగా సీనియర్ బిజేపి నాయకుడు సమ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇటీవల రాజ్యసభ సభ్యుడుగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయనని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోబోతున్నట్లు సమాచారం. కనుక ఆయన స్థానంలో ఈసారి బిజేపి ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి బిహార్ పగ్గాలు చేప్పట్టబోతున్నారు.
బిహార్లో బలమైన కుష్వాహా వర్గానికి చెందిన సమ్రాట్ చౌదరి 1990లో లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీతో రాజకీయాలలోకి వచ్చి ఆ తర్వాత నితీష్ కుమార్ అధ్వర్యంలో జేడీయూలో చేరారు. కొన్నేళ్ళ క్రితం బిజేపిలో చేరారు. ఇంతకాలం నితీష్ కుమార్ ప్రభుత్వంలో డెప్యూటీ సిఎంగా పనిచేశారు. ఇప్పుడు సిఎం పదవి చేపట్టబోతున్నారు.
బిహార్ పగ్గాలు చేపట్టాలని బిజేపి చాలా కాలంగా ఎదురుచూస్తూ నితీష్ కుమార్ కలిసి సాగుతోంది. కానీ అయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం బిజేపికి ఆ అవకాశం లభించదని గ్రహించిన మోడీ, అమిత్ షాలు ఆయనని ఒప్పించి రాజ్యసభకు అక్కడి నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు సమాచారం. నేటికీ బిహార్ ప్రభుత్వంలో జేడీయూ భాగస్వామిగా ఉన్నప్పటికీ బిజేపి చేతికి పగ్గాలు వచ్చాయి కనుక వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బిజేపి సొంతంగా గెలిచి అధికారంలో స్థిరపడే ప్రయత్నాలు చేయడం ఖాయమే.